18, ఫిబ్రవరి 2013, సోమవారం

ప్రేమ్‌చంద్ పై పుస్తకం



సారంలోనూ ప్రేమ్‌చందే! -

"ఆ పిల్లవాడు తిరణాలకు వెళ్ళాడు. కంటిని ఆకర్షించే ఎన్నో ఆటవస్తువులు, బొమ్మలు అక్కడ ఉన్నాయి. నోరూరించే తినుబండారాల అంగళ్ళకు కొదవ లేదు. కానీ, వాటికన్నా రోజూ రొట్టెలు చేయడానికి తల్లి పడుతున్న అవస్థే ఆ పిల్లవాడి మనసులో ముద్రేసుకుంది. కాల్చిన రొట్టెను దించేందుకు పళ్ళకర్ర లేక చేతులు కాల్చుకుంటున్న తల్లే ఆ సమయంలో గుర్తుకు వచ్చింది. దీంతో తన దగ్గరున్న డబ్బులతో ఒక పళ్ళకర్ర కొని ఇంటికి తీసుకెళతాడు.'' ప్రచురణ సంస్థ గానీ ఫలానా రచనని గానీ అంతగా గుర్తులేని ప్రేమ్‌చంద్ కథ ఇది.

ఈ కథలో పిల్లాడిలాగే, జీవితమంతా చాలా బాధ్యతగా, ఇతరుల అవసరాలు తీర్చడంలోనే తన సంతృప్తిని వెతుక్కున్నాడు ప్రేమ్‌చంద్. ఆయన సహచరి శివరాణీదేవి రాసిన 'ఇంట్లో ప్రేమ్‌చంద్' (అనువాదం : ఆర్. శాంతసుందరి) చదివితే ఈ విషయం తెలుస్తుంది. ప్రముఖుల ప్రైవేట్ జీవితాన్ని తెలుసుకోవాలనే ఆసక్తిని తీర్చడమే కాదు, వారి కళా, రాజకీయ వ్యక్తిత్వాలు వికసించే చారిత్రక, సామాజిక ఉద్యమ సందర్భాన్ని కూడా ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ముఖ్యంగా, తల్లి ప్రేమకు ముఖం వాచిపోయిన ప్రేమ్‌చంద్... ప్రతి స్త్రీ నుంచి ఆ లోటు తీర్చుకునేందుకు ఆరాటపడ్డాడు.

భార్యాభర్తల మధ్య గాఢంగా అల్లుకోవాల్సిన ప్రజాస్వామిక సంబంధాలను ఈ క్రమంలోనే ఆయన గుర్తించి గౌరవించాడనేందుకు శివరాణీదేవి-ప్రేమ్‌చంద్‌ల సంభాషణలే రుజువు. ఈ సంభాషణ తరచూ పాత వాసనలు వేయడం, సంప్రదాయ, దైవిక శక్తుల ప్రస్తావనతోనే ప్రేమ్‌చంద్ సైతం తన వాదనను నెగ్గించుకోవడం చూస్తాం. గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి కోసం పోరాడుతున్న రైతాంగంతో ఉండి రచనలు చేసినవాడు కాబట్టి, చివరి వరకు ప్రేమ్‌చంద్‌లో సంప్రదాయ భావనలు నిలిచే ఉన్నాయి. దీన్ని కొంత అర్థం చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముఖ్యమైన పరిశీలన... జాతీయోద్యమం, సోవియట్ విజయాలతో రెక్కవిప్పిన అభ్యుదయ ఉద్యమం సైతం అప్పటికి పూర్తిగా కుబుసం విడవలేదనేది. ఈ అభ్యుదయ ఉద్యమానికి కళా, సాహిత్య రంగాల్లో సారథ్యం వహించినవాడు ప్రేమ్‌చంద్ అనేది ఇక్కడ గమనార్హం. ప్రేమ్‌చంద్ స్మరణకే పూర్తిగా ఈ పుస్తకం అంకితం కాకపోవడం మరో విశేషం.

జాతీయోద్యమంతో మమేకమైన బలమైన రాజకీయ వ్యక్తిత్వం గల ఆధునిక యువతిని శివరాణీదేవిలో మనం చూస్తాం. ఇండియన్ గోర్కీగా పిలవబడే ప్రేమ్‌చంద్ చివరి రచన, చివరి స్మారక ఉపన్యాసం (1936) కూడా గోర్కీపైనే కావడం, మాగ్జిమ్ గోర్కీ మరణించిన రెండు నెలల్లోపే ఆయనా మరణించడం గుర్తుండిపోయే విషయాలు. అయితే ప్రేమ్‌చంద్ జీవన, రచనా సారాన్ని పట్టుకోలేకపోవడం, ఆయన ఉర్దూలో మానేసి హిందీ భాషలో రచనలు చేయడమనే ఒక గుణాత్మక పరిణామానికి ప్రేరణగా నిలిచినదేమిటనేది తెలియజెప్పకపోవడం ఈ పుస్తకం పరిమితే.

- వి. అరవింద్

ఇంట్లో ప్రేమ్‌చంద్ - శివరాణీదేవిఅనువాదం : ఆర్. శాంతసుందరిపేజీలు : 274, వెల : రూ. 120ప్రతులకు : హైదరాబాద్ బుక్ ట్రస్ట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి