14, నవంబర్ 2017, మంగళవారం

ఉపయుక్తమైన కరదీపిక...'.మీరే జర్నలిస్ట్'


---- డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌
మీడియా విశ్లేషకులు, సైన్స్‌ రచయిత
ఆకాశవాణి - తిరుపతి
-----------------------

తప్పెట కొట్టి చాటింపు వేయడం నుంచి ఆండ్రాయిడ్‌ తట్టి మాట్లాడడం దాకా సాగిన మన కమ్యూఁకేషన్స్‌ ప్రస్థానాన్ని గమనిస్తే బోధపడేది ఏమిటి?
అచ్చుయంత్రం, టెలిగ్రాఫ్‌, టెలిఫోన్‌, రేడియో, టెలివిజన్‌, కంప్యూటర్‌, మొబైల్‌ సెల్‌ఫోన్‌ వంటి సమాచార సాధనాలు రావడంతో భావప్రసార విధానం, విఁయోగం విపరీతంగా పెరిగాయి. ఈ టెక్నాలజీ ఆధారంగానే కమ్యూనికేషన్‌ రూపం, స్వభావం, విస్తృతి మారుతూ వచ్చాయి.
తొలిదశలో భాష వృద్ధి చెందడంతో భావ వ్యక్తీకరణ విధానాలు మారాయి. దాంతో సమాచార ప్రసార మార్గాలు రూపొందుతూ వచ్చాయి. మలిదశలో దూరాన్ని జయిస్తూ, ఏక కాలంలో ఎక్కువ మందిని చేరగలిగే టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. అందులో కూడా మార్పులు ఎంత తీవ్రంగా, శీఘ్రంగా ఉన్నాయో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. టెలివిజన్‌ చానళ్ల వేగం ఏమిటో, దీనితో పోలిస్తే మొబైల్‌ దూకుడు ఏమిటో ఒకసారి పోల్చుకోండి!
ఈ మీడియా ప్రయాణంలో పదనిసలు చాలా ఉన్నాయి. ఇది వంద సంవత్సరాల క్రితపు తూర్పు దేశాల ముచ్చట. పత్రికల రాజ్యంలోకి రేడియో ప్రవేశించడం ఒక నిశ్శబ్ద విప్లవం. అచ్చుకావడం, పాఠకులను చేరడం అనే ప్రక్రియల్లో అంతర్భాగమైన ఆలస్యం, దూరం, నిరక్షరాస్యత అనే మూడు పరిమితులను రేడియో ఒక్కసారిగా దాటేసింది. ఫలితంగా పత్రికా యాజమాన్యాలకు కంటగింపు మొదలై, కట్టడి ఆరంభమైంది. అప్పటికి దినపత్రికలంటే సాయంకాల దిన పత్రికలే! పత్రికలు వెలువడి, పాఠకులకు చేరి, వారు చదివిన తర్వాతే` అంటే సాయంకాలం ఏడు గంటల తర్వాతే రేడియో వార్తలు ఇచ్చేది. పత్రిక, రేడియో మాధ్యమాల మధ్య ఈ పెనుగులాట రెండవ ప్రపంచ యుద్ధందాకా కొనసాగింది. ఇది ఒక్క బ్రిటన్‌ అనుభవం మాత్రమే కాదు. చాలా దేశాల చరిత్ర. ప్రస్తుతం ఈ సంగతి తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. రాజకీయాల్లో పెద్దలదన్ను, దాదాగిరి ఎంత సహజమో? మీడియా సామ్రాజ్యవాదం కూడా అంతే సహజం!
పాతికేళ్ల క్రితం మన దేశపు జర్నలిజంలోకి ప్రయివేట్‌ టెలివిజన్‌ వినోద రంగం నుంచి ప్రవేశించింది. న్యూస్‌ టెలివిజన్‌ రాకతో పత్రికా యాజమాన్యాలు, పత్రికా సంపాదకులు ఉలిక్కిపడి విమర్శలు గుప్పించారు. అటువంటి వాదాలు నేటికీ అడపాదడపా వినబడుతుంటాయి. టెలివిజన్‌ మాధ్యమం మేధావుల మాధ్యమం కాదని వీరి వాదం. అయితే అటు యాజమాన్యాలు ఇటు సంపాదకవర్గాలు న్యూస్‌ చానళ్లలోకి ప్రవేశించడమే కాదు. కీలక స్థానాలను కూడా అక్రమించారు.
ఇక్కడ ఇంకో ముచ్చట చెప్పాలి. టెలివిజన్‌ వచ్చేదాకా మీడియా అంటే పత్రికారంగమే! కానీ పిమ్మట దృశ్యం మారిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్‌ మీడియా అనే విభజన మొదలైంది. నేడు మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా అని పరిగణించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కంప్యూటర్‌ రావడంతో ఎలక్ట్రానిక్ రూపంలో అచ్చు పత్రికను పోలిన ఇమేజెస్‌ను ఇ`పేపర్లుగా చదువుకఁనే వెసులుబాటు కలిగింది. ఇది ఎలక్ట్రానిక్ మీడియానా? ప్రింట్‌ మీడియానా? రెండింటికీ అవునూ అనీ, కాదూ అనీ జవాబు చెప్పొచ్చు. అందుకే దీనిని ‘న్యూ మీడియా’ అని పేర్కొన్నారు.
ఉదయం నుంచీ మధ్యాహ్నం దాకా న్యూస్‌ చానళ్ళు పత్రికలను తరిమితే, మధ్యాహ్నం నుంచి పత్రికలను చానళ్లు ఉరకలు పెట్టిస్తాయని భావించడం నిన్నటి వరకూ వాస్తవం. నేడు రెండింటినీ పరుగులు పెట్టిస్తోంది సోషల్‌ మీడియా. టెలివిజన్‌ ఆధిపత్యానికి అవలీలగా గండికొట్టింది సోషల్‌ మీడియా. టెలివిజన్‌ రిమోట్‌తో వీక్షకులు చానళ్లు మార్చడమే తప్ప చూడటం లేదు అనే విమర్శ ఉంది. సుళువుగా చానల్‌ మార్చగలగడంతో ముందుకొచ్చిన సమస్య ఇది. సోషల్‌ మీడియా అలా కాకుండా అరచేతిలో, నీకేమి కావాలో నీవు చూసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సౌలభ్యమే సోషల్‌ మీడియా విజయపాచిక. అంతకు మించి లైసెన్సు, టెక్నాలజీ, పెట్టుబడి, సిబ్బంది లేకుండా సమాంతరగళం వినిపించే, సమాంతర దృశ్యాల్ని చూపించే వేదికను సోషల్‌ మీడియా కల్పించింది. అందువల్ల పత్రిక, టెలివిజన్‌ ఆధిపత్యాన్ని దెబ్బతీయగలిగే సదుపాయం` ఈ ప్రపంచానికి ఈ సమయంలో అవసరమైన గొప్ప ఊరట. ప్రశ్నలకు దొరకని ప్రముఖులూ , పరీక్షలు ఎదుర్కోని సంస్థలూ సోషల్‌ మీడియాను చూసి బెదిరిపోవడంలో ఆశ్చర్యం లేదు. మరో విషయం కూడా గమనించాలి - సోషల్‌ మీడియాలో చదువరి, వీక్షకుడు, జర్నలిస్టు, వార్తాంశాల యజమాని ఒకరే! టెలివిజన్‌ చానల్‌కు ఫుటేజీ, వాయిస్‌ బైట్‌ పంపితే సిటిజన్‌ జర్నలిజం. ఇలా స్వీకరించిన వార్తాంశాలను గమనించి, అవసరమైతే కత్తిరించి చానల్‌లో ప్రసారం చేయవచ్చు. కానీ సోషల్‌ మీడియా ఒకే వ్యక్తి మీడియా వినియోగదారుడు, ఉత్పత్తిదారుడు, నియంత్రించే వ్యక్తి!
మనదేశపు మీడియా గురించి రెండు విషయాలను కీలకంగా భావించాలి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఉజ్వలమైన చరిత్ర భారతదేశపు పత్రికా రంగానిది. స్వాతంత్య్రోద్యమంతో ముడిపడిన భారతీయ పత్రికారంగం దేశవాసులందరినీ కలపడంలోనూ, వారిని ప్రగతిశీలదారుల్లో నడిపించడంలోనూ గొప్ప పాత్రపోషించింది. టెలివిజన్‌ రంగం మాత్రం ప్రపంచీకరణతో ప్రాణం పోసుకుని విస్తరించింది. ఇక్కడ వాణిజ్యమే ఊపిరి. మిగతా అంతా ఊక, ఉబుసుపోక! అందుకే టెలివిజన్‌ తెరపై రక్తికట్టిన వాణిజ్య చమత్కారాలు నేటికీ పత్రికల్లో రసాభాస అవుతున్నాయి. డెబ్బయ్యేళ్ల క్రితపు విలువలు నేటి మీడియా రంగంలో వెతికి భంగపడుతున్న వ్యక్తులకు కొదవ లేదు. ఒకే సంస్థకకు ఒకే చోట నుంచి పత్రిక ప్రచురణను, చానల్‌ ప్రసారాన్ని అమెరికా వంటి దేశాల్లో కూడా అనుమతించరు. దీనిని క్రాస్‌ మీడియా రెగ్యులేషన్‌ అంటారు. అలాంటి నియమాలు రూపుదిద్దుకోక ముందే మన దేశపు ఎలక్ట్రానిక్ మీడియాలో విస్పోటనం సంభవించింది. నేడు సోషల్‌ మీడియాకు సంకెళ్లు అవసరమని కొందరు వాదిస్తూ, కొన్ని కారణాలు చూపిస్తున్నారు.
నేడు ఏ మీడియా కూడా సేవ కాదు. ఫక్తు వాణిజ్యం, వ్యాప్తి, లాభార్జన ధ్యేయం. అయితే దీనిని బాహాటంగా చెప్పుకోకఁండా లాఘవంగా తప్పుకుంటారు. మీడియా అంటే వాణిజ్యమే కాదు. అధికారం, రాజకీయం కూడా! కనుకనే పార్టీలకు చానళ్లున్నాయి. ముందు ముందు మీడియా సంస్థలకు పార్టీలు వచ్చినా ఆశ్చర్యపోకూడదు!
******** ****** ********
ఇంత పరిణామశీలంగల, , ప్రభావవంతమైన మీడియాను ఎలా అధ్యయనం చేయాలి? ఒక పరిణామాన్నీ, దాని ప్రభావాలను గమనించే లోపు మరిన్ని పరిణామాలు ముందుకొస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మీడియాపై సమగ్ర అవగాహన విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ద్వారా లభిస్తుందా? మీడియా సంస్థల శిక్షణాకాలంలో దక్కుతుందా? చాలా మౌలికమైన ప్రణాళికలో సాగే విశ్వవిద్యాలయ కోర్సు ప్రయోజనం పరిమితం. ఇక మీడియా సంస్థలో ఇచ్చే శిక్షణలు ఆ సంస్థ అవసరాలు, దృక్పథాల్ని బట్టి ఉంటాయి కానీ, సమాంతర వాదాలు కానీ, సమగ్రమైన అవగాహన కానీ సాధ్యం కావు. అందుకే నిజమైన జర్నలిస్టులు ఏకలవ్యులుగా ముందుకు సాగాలి. కనుకనే ఎక్కువ అపజయాలు, తక్కువ సంఖ్యలో అపురూప విజయాలు ఎదురవుతాయి. మరి మీడియా పాండిత్యం, నైపుణ్యం ఎలా సాధ్యపడతాయి? మీడియాని పరిశీలించడమే ఏకైక అధ్యయన మార్గం! వందల సంఖ్యలో పత్రికలు, చానళ్లు ఉన్నప్పుడు, వీటికి మించి సోషల్‌ మీడియా విజృంభిస్తున్నప్పుడు మీడియా పరిశీన ఎలా సాధ్యం? ఇది సాధ్యపడే విషయం కాదు పూర్తిగా! కానీ ఇదే ఏకైక మార్గం. దీనికి కొంత ఊతంగా తోడ్పడేవి మీడియా గురించి వెలువడిన పుస్తకాలు. పాతికేళ్ల క్రితం ఇలాంటి పుస్తకాలు అపురూపం కానీ, ఇటీవల ఏన్నో రకాల మీడియా గ్రంథాలు వెలువడ్డాయి, ఇంగ్లీషుతో పోలిస్తే తెలుగులో మీడియా గ్రంథాలు తక్కువే కావొచ్చు. కానీ వైవిధ్యం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో మీడియాపై తగిన అవగాహన కలిగించే పుస్తకం ` బెందాళం క్రిష్ణారావు గారి ‘మీరే జర్నలిస్ట్‌’ అనే ఈ పుస్తకం. గతంలో ‘వార్తలు ఎలా రాయాలి?’ అనే వీరి పుస్తకం 2006లో వచ్చింది. అంతవరకు వారు నాకు తెలియదు. హైదరాబాదు, విజయవాడ వంటి నగరాల నుంచి కాకుండా శ్రీకాకుళం నుంచి ఈ పుస్తకం వెలువడడం ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించింది. తర్వాత రచయిత వివరాలు తెలియడం, స్వయంగా కలవడం... అలా మా అనుబంధం మొదలైంది. వారికి సమాజం పట్ల ఆసక్తి, వృత్తి పట్ల బాధ్యత ఉన్నాయి. బౌద్ధం పట్ల , మార్క్సిజం, అంబేద్కరిజం పట్ల అభిమానం, గౌరవం, సాహిత్యం పట్ల అభిలాష ఉన్నాయి. సుమారు మూడొందల డెబ్బయి పేజీల ఈ గ్రంథంలో తొంబయి రెండు అంశాలున్నాయి. నిజానికి ఒక్కో అంశం మీద ఒకో పుస్తకం రాయడానికి ఆస్కారం ఉంది. కనుక మితి లేదు. అయితే చాలా వరకూ అవగాహన కలిగించడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. అదే సమయంలో ఇందులో జత చేయడానికి ఎన్నో అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కొంతకాలం సంపాదకీయాలు ప్రచురించకఁండా, మరికొంత కాలం ఎక్కడబడితే అక్కడ సంపాదకీయాలు ప్రచురించిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక కొన్ని సంవత్సరాలుగా కీలకమైన వార్త ఇచ్చే చోట ‘టైమ్స్‌ వ్యూ’ అని క్లుప్తంగా ఇస్తోంది. సంపాదకీయం అంటూ విడిగా ప్రచురించని ‘మింట్‌’ పత్రిక తొలిపుటలో ‘క్విక్‌ ఎడిట్‌’ అని పది పన్నెండు వాక్యాల వ్యాఖ్య రాస్తుంది. అంతా కుదించుకుని, కుచించుకుని పోతున్న సమయంలో ‘న్యారేటివ్‌ జర్నలిజం’ మళ్లీ ఆసక్తి కలిగిస్తోంది. ‘క్యారవాన్‌’ మాసపత్రిక, ‘మింట్‌’ దినపత్రిక ఈ తరహా జర్నలిజానికి ఉదాహరణలు. దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు బుజ్జాయి 1960లో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఆరంభమైనప్పుడు ‘పెత్తందార్‌’ అనే కార్టూన్‌ స్ట్రిప్‌ ప్రతిరోజూ వేసేవారు. తెలుగులో వారిదే తొలి స్ట్రిప్‌ కార్టూన్‌. ఇలా ఎన్నో విషయాలుండొచ్చు. ఈ పుస్తకంలో బెందాళం క్రిష్ణారావు గుదిగుచ్చిన అంశాల జాబితా కూడా ఇలానే ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ రకంగా కూడా ఇది ఒక బుల్లి జర్నలిజపు సర్వస్వం! కనుకనే వారికి నా అభినందనలు.
( మీరే జర్నలిస్ట్....పుస్తకానికి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు రాసిన విలువైన ముందుమాట )
***********************

24, అక్టోబర్ 2017, మంగళవారం

మనకు తెలియని యం.ఎస్ - దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు

 



యం.యస్‌. సుబ్బులక్ష్మి గురించి అధ్యయనం 2004వ సంవత్సరంలో ఒక ''వెలుపలి వ్యక్తి'' నుంచి, అదీ తన క్రైస్తవ తల్లిదండ్రులు పెట్టిన పేరుగల వ్యక్తి నుంచి రావటం, కర్ణాటక సంగీత సామ్రాజ్యపు కంచుకోటలో కలవరం రేపింది. నేను తమిళనాట పెరగలేదనే విషయం దానిని మరింత అనుమానాస్పదం చేసింది. ఐతే తొందరలోనే క్షమాభిక్ష వచ్చింది, కొంత మెచ్చుకోలు కూడా దొరికింది. ఐతే మొదట వచ్చిన అభ్యంతరాలు, ఇటీవలి కాలం వరకూ కర్ణాటక సంగీత ప్రపంచాన్ని పరిపాలించిన కొన్ని బృందాలకున్న సెంటిమెంట్లను ఎత్తిచూపాయి. 

యమ్‌.యస్‌. సుబ్బులక్షి ్మకి మతం, భాషా ఎలాంటి సమస్యలనూ తెచ్చిపెట్టలేదు. ఒక బాల మేధావిగా ఇరవయ్యవ శతాబ్ద ప్రారంభంలో సంగీతాకాశంలో ఉదయించినప్పుడు ఆమె సాంఘిక నేపథ్యం ఆమెపై నిర్హేతుకమైన అయిష్టతను కల్పించి బాధించింది. భారతదేశపు సంప్రదాయ పరాయణ సాంఘిక వాతావరణంలో ఆచారాల కట్టుబాట్ల బిగింపు చూసినప్పుడు వందేళ్ళ క్రితం ఉన్న అపోహలు, అభిప్రాయభేదాలు ఇప్పటికీ సజీవంగా ఉండటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. సంగీతంలోనూ, రాజకీయ జీవితంలోనూ ప్రజాస్వామ్యాన్ని కోరుతూ కొత్తతరం కళాకారులు ప్రవేశించారు. శ్రోతల దృక్కోణాలలో, వారాశించేదానిలో కొత్త పద్ధతులు వచ్చాయి. వర్తమానాన్ని ఉత్సాహవంతంగా చేసి, భవిష్యత్తుని మార్చేవిగా వున్న సవాళ్ళు కర్ణాటక సంగీత సంస్కృతిలో భాగంగా ఉన్నాయి.

16వ శతాబ్దంలో పురందరదాసు ప్రపంచంలోనే అతి కఠినమైన గణిత పూర్వక సంగీత నిర్మాణానికి పునాదులు వేసినప్పటి నుంచీ ఈ సంగీతం ఒక నిరంతరాయపు తేజస్సును తనలో శాశ్వతంగా ముద్రించుకున్నది. రెండు శతాబ్దాల తర్వాత ముగ్గురు అత్యంత ప్రతిభావంతులు, కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా మనకు తెలిసినవారు ఒకే గ్రామంలో సమకాలీనులుగా పుట్టటంతో శాస్త్రీయ యుగోదయం జరిగింది. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్‌, శ్యామశాస్త్రిలు ఏర్పరిచిన ఉన్నత ప్రమాణాలు కర్ణాటక సంగీతోత్సవ సంవత్సరాలకూ, ఇరవయ్యవ శతాబ్దపు స్వర్ణయుగానికీ దారితీశాయి. ఈ కాలంలో నైపుణ్యత ఎంతగా పెరుగుతూపోయిందంటే, ఈ కాలంలోనే మహిళా సంగీతకారులలోనే 'త్రిమూర్తులు' అనే పేరుతో రెండు జట్లు రావటం మనం చూశాం. ఈ పుస్తకం ఏ సాహసవంతులకు అంకితమయిందో వారు ఒక జట్టయితే, తర్వాత అందరితో ఆరాధింపబడిన యమ్‌.యస్‌. సుబ్బులక్షి ్మ, డి.కె. పట్టమ్మాళ్‌, ఎమ్‌.ఎల్‌. వసంతకుమారిలు మరొక జట్టు. స్వర్ణయుగాన్ని కొనసాగిస్తూ ఆధునిక యుగం ప్రారంభమైంది. అద్భుతమైన గాయకులు ప్రతి ఇంటా చెప్పుకునే పేర్లయ్యారు. ఇరవయ్యవ శతాబ్దానికి, ఇరవయ్యొకటవ శతాబ్దానికీ మధ్యకాలంలో సంచరించే కొత్త తరం - ప్రతిభ కలిగిన విద్యావంతులైన స్త్రీ పురుషులతో కర్ణాటక సంప్రదాయానికి వారి పద్ధతులలోనే న్యాయంచేస్తూ ప్రవేసించింది. వాళ్ళు మన చుట్టూ, ఒకే సమయంలో ప్రేరణనీ, భయాన్నీ కలిగిస్తూ, వారి మార్గాలలో సౌకర్యవంతంగా 

ఉంటూ, భిన్నంగా ఉన్నందుకు భయపడకుండా ఉన్నారు. సంజయ్‌ సుబ్రమణ్యన్‌, పి. ఉన్నికృష్ణన్‌, అభిషేక్‌ రఘురామ్‌ అటువంటి వాళ్ళలో కొద్దిమంది మాత్రమే. ఈ సోదరుల జాబితాలోంచి ఒక పేరుని విడిగా తీసి చెప్పాలంటే, అటి టి.యమ్‌. కృష్ణ, గాయకుడు, పండితుడు, సామాన్య ప్రజానీకపు విశ్వాసాలపై, విలువలపై దాడిచేసినవాడు. మూడు గుణాలు ముప్పేటగా కలిగినవాడు. సామాజిక వాతావరణంలోకి అతను బలవంతంగా ప్రవేశపెట్టిన విషయాలు, యమ్‌.యస్‌. సుబ్బులక్షి ్మ తన పదవ యేట మొదటి రికార్డు ఇచ్చినప్పుడు ఆమెను వెంటాడిన భయాలే.

ఆ కాలంలో ఆందోళన, చిరాకు కలిగించే సమస్యలు లేవంటే - తక్కువ కులాలకు చెందిన కళాకారులను, ఉన్నత కులాలవాళ్ళు అంగీకరించకపోవటం, మహిళా గాయకుల పట్ల పురుషులకున్న అభ్యంతరాలు. యమ్మెస్‌ ఈ రెండింటినీ అధిగమించింది. అందుకు ఆమె సంగీతపు మహా ఔన్నత్యానికి ఆమెను సంస్కృతీకరించటంలో ఆమె భర్త చేసిన తెలివైన నిర్వహణకు మనం ధన్యవాదాలు చెప్పాలి. కానీ సమస్యలు అంతటితో తీరిపోలేదు. యమ్మెస్‌ సుబ్బులక్షి ్మ ''మీరా'' సినిమా (1945) విడుదలయ్యేనాటికి టి.యమ్‌. కృష్ణన్‌ పుట్టలేదు. ఇంకా చెప్పాలంటే మొదటి కొత్తతరపు విప్లవం తెచ్చిన ఫ్లవర్‌ చిల్డ్రన్‌, సమ్మర్‌ ఆఫ్‌ లవ్‌ (1967) సమయంలో కూడా ఆయనలేడు. దాదాపు ఒక దశాబ్దం గడిచాక, ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి ఆరునెలలు గడిచాక ఆయన వచ్చాడు. కానీ అప్పుడాయన కర్ణాటక సంగీతాన్ని ''బ్రాహ్మణాధిపత్యంతో, పురుషాధిపత్య నిరంకుశ ధోరణి''లో ఉందని, దానికి ''సాంఘిక పునర్నిర్మాణం'' అవసరమని వర్ణించాడు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు.

కృష్ణను తేలిగ్గా తీసిపారెయ్యలేము. అయన తమిళనాడులోని 2.75% బ్రాహ్మణ వర్గంలో భాగమని మాత్రమే కాదు; అతని చర్యలు అతని మాటలను బలపరిచాయి. మద్రాసులో వందేళ్ళ నుంచీ జరుగుతున్న మార్గఝి సంగీత సీజన్‌ నుంచి అతను బైటికి వచ్చేసి, కళలలో ఉన్న వివక్షను ప్రతిఘటించాడు. నగరంలోనే ప్రముఖమైన సభా మంటపాలలో కచేరీలు జరుగుతున్నప్పుడు ఆయన సముద్రతీరంలో జాలర్లకోసం కచేరీ ఏర్పాటు చేశాడు.

కృష్ణ చేసే కొన్ని వాదనలు నిజానికి అతి అనిపిస్తాయి. బహుశ తమిళ బ్రాహ్మణ ఆధిపత్యం సంస్థాగత స్థాయిలో మాత్రమే ఉందేమో. కళాస్థాయిలో తమిళులు కానివాళ్ళు, బ్రాహ్మణేతరులు కూడా ప్రతిభతో ఉన్నతస్థాయికి ఎదిగారు. ''శాస్త్రీయ'' అనే పదం అంటేనే, ''మరీ ఉన్నతులది''గా పేర్కొనటాన్ని అనుమానించాలి. కళ, సాహిత్యం వీటన్నిటినీ వర్గీకరించేటప్పుడు 'శాస్త్రీయ' అనేమాట వాటిలో ఒక ఉన్నతస్థాయికి చేరాలనే ఆశను ఎత్తిచూపుతుంది. కానీ ''సంగీతాన్ని ఆనందించాలన్నా, నేర్చుకోవాలన్నా కొన్ని సాంఘిక, మతపరమైన అవసరాలను సృష్టించటం'' గురించి అతను చేస్తున్నదాడి గురించి కూడా ఆలోచించవలసిందే. కర్ణాటక సంగీతం ''మతపరమైన హిందూ అనుభవంగా కనిపించేలా'' ఉండకూడదనే అతని వాదనలోనూ విషయముంది.

హిందూస్తానీ సంగీతంలో మతపరంగా కనిపించే ఛాయలు కనిపించవు. (ముస్లింల కారణంగానూ, వారున్నప్పటికి - మనం చూసే దృష్టి కోణాన్నిబట్టి). కొన్ని అంచనాల ప్రకారం ఉత్తర భారత సంగీతానికి దక్షిణాదిన విపుల ప్రజాదరణ పెరుగుతోంది. కర్ణాటకలో ఆ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది; కర్ణాటక సంగీత వ్యాకరణాన్ని పురందాసు ఎక్కడ శ్రమించి ఏర్పరిచాడో, అక్కడ భీమ్‌సేన్‌ జోషి, గంగూబాయ్‌ హంగల్‌ హిందూస్థానీ సంగీత ఇంద్రజాలాన్ని వ్యాపింపజేశారు. ఆ ఇంద్ర మాయాజాలం కొనసాగితే దానికి ఒక కారణం, ఉత్తరాది సంప్రదాయం సాపేక్షంగా చూస్తే తేలికగా అందుకునేందుకు వీలుగా ఉండటమే. దక్షిణాది పద్ధతి చాలా కఠినం కావటంతో గొప్పవాళ్ళెవరూ శిష్యులను మిగిల్చి వెళ్ళరు.  కర్ణాటక శుద్ధ సంగీత సారమైన వీణ ధనమ్మాళ్‌కి ఆమె బాణీలో ఆమె శైలిలో పాడేందుకు ప్రయత్నించేవారసలు లేరు. బాల సరస్వతి, బెంగుళూరు నాగరత్నమ్మకి కూడా అంతే. ఆధునిక సంగీత పండితులు చెంబై వైద్యనాధ భాగవతార్‌ నుంచి జి.యన్‌. బాలసుబ్రహ్మణ్యం వరకూ - వారందరినీ సంగీతజ్ఞులైన శ్రోతలు విని ఆనందించారు గానీ వారి సంఖ్య ఊగిసలాడుతూ ఉంటుంది. కారణం వివరించలేనిది కాదు. యమ్మెస్‌ సుబ్బులక్షి ్మ ఒక్కతే ప్రజాదరణ ఏమాత్రం తగ్గని కర్ణాటక గాయని. నిజానికి ఆమెకు ప్రజాదరణ పెరుగుతూ వస్తోంది. ఆమె పాడిన 'సుప్రభాతం' క్యాసెట్ల అమ్మకాన్ని లెక్కలోకి తీసుకుంటే -

సుప్రభాతం గాఢమైన భక్తి విషయంలోనూ, పాడే పద్ధతిలోనూ, యమ్మెస్‌ భక్తి సంగీతం అందంగా, ఉన్నతంగా మరువలేనిదిగా ఉంటుందని ఒప్పుకుంటూనే, టి.యమ్‌. కృష్ణ తను రాసిన ''దక్షిణాది సంగీతం'' అనే పాఠకాదరణ పొందిన పుస్తకంలో ఇలా రాశాడు ''కఠినమైన సంగీత కళలోని గాంభీర్యాన్నంతా కలిగిన మరో ''యమ్మెస్‌ సంగీతం'' ఉండగలిగేది, నిజంగా తయారయ్యేది. దానిని ''దైవత్వ యమ్మెస్‌'' అనే లెజెండ్‌ వల్ల కోల్పోయాం.''

విషాదగీతంలా కనిపించే పైమాట నిజానికి ఉత్సవ గీతమనే చెప్పాలి. ఎందుకంటే ఆ దైవత్వపు లెజెండ్‌ సంగీత కళలోని శృతిలయబద్ధతను తగ్గించలేదు. యమ్మెస్‌ సంగీతం తన సమకాలీనులెవరలోనూ లేనంతగా అన్నిటినీ కలుపుకుని కాంతిని కాపాడుకుంది. ఆమె పాడటం మొదలుపెట్టిన తొంభై సంవత్సరాలలోనూ ఆ కాంతి ఎన్నడూ తగ్గలేదు. 2016లో ఆమె శతజయంతి ఒక చరిత్రాత్మక గుర్తుగా మారుతుంది. భారత ప్రభుత్వం సాంస్కృతిక సంపదతో దేశాన్ని మానవాతీతంగా చేసిన ఏడుగురు ఐకాన్స్‌ని ఎంచుకున్నప్పుడు ఆ ఏడుగురిలో సుబ్బులక్షి ్మ బిస్మిల్లాఖాన్‌తోపాటు ఉంది. బహుశ, ఇంకా ప్రముఖంగా, యమ్మెస్‌ వందవ పుట్టినరోజు సందర్భంగా ఆమె జన్మస్థలమైన మధురైలో ఒక ప్రత్యేక సంగీత నివాళిని మునిమనవరాలైన యస్‌. ఐశ్వర్య (టి. సదాశివం కూతురు, అర్థ శతాబ్దర పాటు యమ్మెస్‌కి గాత్ర సహకారం అందించిన రాధా విశ్వానాధన్‌ మనవరాలే ఐశ్వర్య) అర్పించటం జరుగుతుంది. యమ్మెస్‌ బాణి కొనసాగుతుందనేందుకు అంతకంటే ఉచితమైన నిదర్శనం ఉండదు. దాని గురించి రాధ ఇలా వివరించారు. ''కేవలం పాడటం కాదు, జీవితంలోనూ సంగీతంలోనూ భక్తి, వినమ్రతలుండటం''. శాస్త్రీయ కళలు కాలంతోపాటు నడుస్తూ తమ శాస్త్రీయతను నిలుపుకుంటున్నప్పుడు, యమ్మెస్‌ సంగీతం తాను సంకేతంగా ఉన్న విశ్వజనీన సుగుణాలతో కాలానుగుణంగా నిలిచి ఉంటుంది. నెమ్మదిగా కానీ చాలా గట్టిగా యమ్మెస్‌ కాలాతీతమైన విలువలను ఎత్తిపట్టి, ఆ క్రమంలో తను కూడా కాలతీత మయ్యారు. యమ్మెస్‌ జీవిస్తున్నారు.

మనకు తెలియని యం.ఎస్ - 
దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు 
- టి. జే. ఎస్. జార్జ్ 
తెలుగు అనువాదం : ఓల్గా 


ప్రతులకు, వివరాలకు : 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు; 240, వేల ,150/-